Chandrababu: అసలే డ్రైవింగ్ తెలియని వ్యక్తి... రివర్స్ గేర్ లో తీసుకెళుతున్నాడు: చంద్రబాబు

  • నంద్యాల జిల్లా నందికొట్కూరులో ప్రజాగళం సభ
  • ప్రతి ఒక్కరినీ నాశనం చేసిన వ్యక్తి జగన్ అంటూ చంద్రబాబు ధ్వజం
  • ఏమిటీ చెత్త పరిపాలన అంటూ విమర్శలు
  • డ్రైవింగ్ చేతకాని వ్యక్తికి డ్రైవింగ్ అప్పగించారని వ్యాఖ్యలు 
Chandrababu targets CM Jagan

నంద్యాల జిల్లా నందికొట్కూరు ప్రజాగళం సభకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి ఒక్క ఇంటిని, ప్రతి ఒక్క ఊరిని, ప్రతి ప్రాంతాన్ని నాశనం చేసిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి అని ధ్వజమెత్తారు. యువత, రైతులు, బీసీలు, ముస్లింలు, మహిళలు... ఇలా ఏ వర్గం వారు కూడా ఆనందంగా లేరని అన్నారు. ఏమిటీ చెత్త పరిపాలన అంటూ విమర్శించారు. 

"సైకో జగన్ కు తెలిసిందల్లా రద్దులు, గుద్దులు, బొక్కుడు, నొక్కుడు, కూల్చివేతలు, కేసులు... ఇవి కాకుండా ఒక్క మంచి పని చేశాడా? నేను నందికొట్కూరు నుంచి సవాల్ విసురుతున్నా. నేనేం చేశానో చెబుతున్నా. ఈ జిల్లాను తీసుకుంటే... తంగడంచలో మెగా సీడ్ పార్క్ ఏర్పాటుకు ముందుకెళ్లాను. అది వచ్చుంటే రైతులకు ఆదాయం పెరిగేది, మీరు పండించే పంట విత్తనాలుగా మారి ప్రపంచానికి వెళ్లుంటే మీ ఆదాయం పెరిగి పరిశ్రమలు వచ్చేవి. ఈ యువత ఎక్కడికీ వెళ్లే పనిలేకుండా మీ ఊర్లోనే ఉద్యోగాలు వచ్చేవి. 

అమెరికాలోనే బెస్ట్ విద్యాసంస్థ అయోవా యూనివర్సిటీ. ఆ సంస్థతో  ఒప్పందం కూడా కుదుర్చుకున్నాం. కానీ ఈ దుర్మార్గుడు, దుష్టుడు ఆ ఎంఓయూ నేను చేశానన్న కారణంతో మీ పొట్టకొట్టాడు. 

రూ.365 కోట్లతో జైన్ ఇరిగేషన్ కు ఒక ప్రాజెక్టు ఇచ్చాం. ఆ ప్రాజెక్టుతో నర్సరీ మొత్తం తయారుచేసి, ఆదర్శప్రాయమైన మైక్రో ఇరిగేషన్ తో రాయలసీమను హార్టికల్చర్ గా మార్చి మీ ఆదాయాన్ని రెట్టింపు చేయాలని భావించాను. కానీ ఈ రోజు జైన్ ఇరిగేషన్ వచ్చిందా? ముచ్చుమరి ప్రాజెక్టు పూర్తి చేసింది ఎవరు? ఇలాంటి ప్రాజెక్టులు ఒకటీ రెండు కాదు. 

మరోవైపు ఓర్వకల్లు. నేనే ఒక్క సంవత్సరంలో ఎయిర్ పోర్టు కట్టించాను. ఇక్కడి వ్యవసాయ ఉత్పత్తులు ఎయిర్ కార్గో ద్వారా విదేశాలకు కూడా వెళ్లేందుకు ప్రణాళికలు రచించాను. సోలార్ పార్క్, విండ్ మిల్స్, పంప్డ్ ఎనర్జీకి శ్రీకారం చుట్టాను. ఇవాళ ఇవన్నీ వచ్చాయా? ఇవన్నీ గనుక వచ్చుంటే హైదరాబాద్ కు నందికొట్కూరు ఒక శాటిలైట్ టౌన్ షిప్ మాదిరిగా తయారయ్యేది. 

కానీ ఈ రాయలసీమ ద్రోహిని, నందికొట్కూరును నాశనం చేసిన వ్యక్తిని మీరు క్షమిస్తారా? ఈ జగన్ ఒక సైకో, ఒక అహంకారి, విధ్వంసకారుడు. ఊరికొక సైకోను తయారుచేశాడు. ఇక్కడ కూడా ఒక పిల్ల సైకో ఉన్నాడు. 

ముఖ్యమంత్రిగా ఉండేందుకు జగన్ కు అర్హత ఉందా? పరిపాలన చేతకాని వ్యక్తి జగన్. డ్రైవింగ్ చేతకాని వ్యక్తికి మీరు డ్రైవింగ్ అప్పగించారు. అసలే డ్రైవింగ్ తెలియదు, రివర్స్ గేర్ లో తీసుకెళుతూ అందరి జీవితాలను నాశనం చేస్తున్నాడు" అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు.

More Telugu News